Tejasvi Surya on Revanth Reddy Delimitation Logic | పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాజకీయ సెగలు రేగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన డీలిమిటేషన్ మోడల్ను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా తప్పుపట్టారు.
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి (GSDP) ఆధారంగా సీట్ల పెంపు ఉండాలన్న ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
“జీడీపీ గణాంకాలు కాలానుగుణంగా మారుతుంటాయి. మారుతున్న ఆర్థిక గణాంకాల ఆధారంగా నియోజకవర్గాలను కేటాయించడం అసాధ్యం. అలా చేస్తే ప్రతి ఏటా నియోజకవర్గాలు మారిపోతుంటాయి” అని సూర్య పేర్కొన్నారు.
అంబానీకి లక్ష ఓట్లు ఉండాలా..
ఈ సందర్బంగా ప్రతిపక్షాల తర్కాన్ని ప్రశ్నిస్తూ.. “సంపద ఆధారంగానే ఓటు హక్కు, సీట్ల కేటాయింపు ఉండాలంటే.. రేపు ముఖేష్ అంబానీకి ఒక లక్ష ఓట్లు, సామాన్యుడికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని కోరతారా? ఇది అత్యంత హాస్యాస్పదమైన వాదన” అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ తీరుపై విమర్శలు..
డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడానికి, జాప్యం చేయడానికే కాంగ్రెస్ ఇలాంటి అసంబద్ధమైన వాదనలను తెరపైకి తెస్తోందని ఆయన ఆరోపించారు.
జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు.. జనాభాతో పాటు రాష్ట్రం సాధించిన ఆర్థిక ప్రగతిని (GSDP) కూడా ప్రాతిపదికగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపాదించారు. దీనివల్ల నిధుల కేటాయింపులో, రాజకీయ ప్రాతినిధ్యంలో దక్షిణాదికి నష్టం జరగదని ఆయన వాదించారు.
పునర్విభజన అంశం కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకుండా, ఉత్తరాది – దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యతకు సంబంధించిన అంశంగా మారడంతో, రాబోయే రోజుల్లో పార్లమెంటులో ఈ పోరు మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.






