MH CM Devendra Fadnavis Visits Pawan Kalyan | కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు.
మర్యాదపూర్వకంగా ఆసుపత్రికి విచ్చేసిన ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు నేతలు కాసేపు ముచ్చటించారు.
సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్న తీరును వైద్యులను అడిగి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు.
పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో, అత్యంత వేగంగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
శస్త్రచికిత్సకు గల కారణం ఏంటంటే..
గత కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్కు, వైద్యుల సూచన మేరకు ముంబయిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స (Surgery) విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పరామర్శకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రావడం రాజకీయ వర్గాల్లోనూ, ఇరు రాష్ట్రాల కూటమి శ్రేణుల్లోనూ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ అటు జనసైనికులు, ఇటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు.







