Hyd Bars Timings Extended | ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026) క్లైమాక్స్కు చేరుకున్న వేళ, హైదరాబాద్లోని ఫుట్బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది.
ప్రపంచ కప్ ఫైనల్ పోరుతో పాటు, మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్ల దృష్ట్యా.. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రో బ్రూవరీలను నిర్ణీత సమయం కంటే అదనంగా తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమవుతుండటంతో.. అభిమానులు ఇళ్లకే పరిమితం కాకుండా, పబ్లిక్ ప్లేసుల్లో గ్రూప్లుగా బిగ్ స్క్రీన్లపై మ్యాచ్లను ఎంజాయ్ చేసేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం మద్యం సరఫరా వేళలను ఈ క్రింది విధంగా పొడిగించారు.
మూడో స్థానం కోసం జరిగే రసవత్తర పోరు నేపథ్యంలో.. శనివారం రాత్రి బార్లు, క్లబ్బులను తెల్లవారుజామున 4:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు మరియు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చారు.
అర్జెంటీనా మరియు స్పెయిన్ జట్ల మధ్య జరగనున్న మహా సంగ్రామం (ఫైనల్ మ్యాచ్) కోసం ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3:00 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు వెసులుబాటు కల్పించారు.
అసోసియేషన్ విజ్ఞప్తిపై స్పందించిన ప్రభుత్వం..
ఫిఫా మ్యాచ్ల టైమింగ్స్ వల్ల అభిమానులు ఇతరులతో కలిసి పబ్లిక్గా స్క్రీనింగ్ చూసే అవకాశం లేకుండా పోయింది.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రపంచకప్ ముగింపు మ్యాచ్ల వేళ పనివేళలను పొడిగించాలని ‘తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్’ జూలై 14న ప్రభుత్వానికి ఒక వినతిపత్రాన్ని సమర్పించింది.
దీనిపై సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ తక్షణ అనుమతులు మంజూరు చేయగా.. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
“ప్రభుత్వ నిర్ణయంతో నగరంలోని ఫుట్బాల్ ప్రేమికులు తమ స్నేహితులతో కలిసి బిగ్ స్క్రీన్లపై మ్యాచ్లను తిలకిస్తూ పండుగలా ఆనందించే అవకాశం లభించింది.
అయితే, పొడిగించిన ఈ ప్రత్యేక పనివేళల్లో ప్రభుత్వ నిబంధనలను బార్లు కచ్చితంగా పాటించాలి. శాంతిభద్రతలు, భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు” అని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.







