- అమిత్ షాను ‘చాణక్య’ అని పిలుస్తూనే సెటైర్లు!
Priyanka Gandhi Vadra Lok Sabha Speech | లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తనదైన ముద్ర వేశారు.
ఓ వైపు ప్రశంసలు మరోవైపు సెటైర్లతో అధికార పక్షంపై ఆమె సంధించిన విమర్శలు సభలో నవ్వులు పూయించాయి.
ప్రధాని మోదీ తరచూ నెహ్రూను విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. “మహిళలకు సమాన హక్కుల కల్పన వెనుక ఒక నెహ్రూ కృషి ఉంది. కానీ భయపడకండి.. ఆయన మీరు భయపడే నెహ్రూ కాదు” అంటూ చమత్కరించారు.
1928 నాటి మోతీలాల్ నెహ్రూ నివేదిక, 1931 కరాచీ సెషన్ నిర్ణయాలను ఆమె గుర్తు చేశారు. హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరంతా పూర్తి ప్లానింగ్తో వచ్చారు. నేడు చాణక్యుడు బతికి ఉంటే, మీ తెలివితేటలు చూసి ఆయన కూడా షాక్ అయ్యేవారు” అని ఆమె అనగానే సభలో నవ్వులు విరిశాయి.
ఈ బిల్లు ప్రస్తుత రూపంలో పాస్ అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతమవుతుందని, పునర్విభజన ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా ఉండేలా కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
మహిళా బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతుండగా, ఆమె చుట్టూ కేవలం పురుష ఎంపీలే కనిపించడం ఒక విచిత్రమైన దృశ్యంగా నిలిచింది.
రాహుల్ గాంధీ కితాబు..
ప్రసంగం చివర్లో సభకు వచ్చిన రాహుల్ గాంధీ, తన సోదరి ప్రసంగం చూసి చప్పట్లు కొట్టారు. “ఇదే జోరును కొనసాగించు” అంటూ ఆమెను ఉత్సాహపరిచారు.
ఎక్కడా పేరు పెట్టి విమర్శించకుండా, చేదు నిజాలను తీపి మాటలతో చెప్పడంలో ప్రియాంక గాంధీ సఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో ఆమె తొలి అడుగు గట్టిగానే పడిందని ఈ ప్రసంగం నిరూపించింది.








