- కొత్త ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని కీలక హెచ్చరిక!
PM Modi Advice to New NDA MPs | పార్లమెంట్ సమావేశాలు వరుసగా మూడో వారం కూడా ప్రతిష్టంభనలో కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం అధికార ఎన్డీఏ (NDA) కూటమికి చెందిన కొత్త రాజ్యసభ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అల్పాహారం విందు సందర్భంగా గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో 30 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ రాజకీయం, వ్యక్తిగత ప్రవర్తన మరియు పార్లమెంటరీ పనితీరుపై ఎంపీలకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు ఇచ్చారు.
“లుటియన్స్ జోన్లో జాగ్రత్తగా ఉండండి”..
ఢిల్లీ రాజకీయాల్లో ఎలా నెగ్గుకురావాలో చెప్తూ ప్రధాని మోదీ కొత్త ఎంపీలను అప్రమత్తం చేశారు. “లుటియన్స్ జోన్లో జాగ్రత్తగా ఉండండి. కుట్రల వల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఎవరిని కలుస్తున్నారో, ఎక్కడ కలుస్తున్నారో నిశితంగా గమనించండి. ఢిల్లీ ప్రమాదకరమైన ప్రదేశం” అని మోదీ ఎంపీలకు స్పష్టం చేసినట్లు వర్గాలు వెల్లడించాయి.
ఎంపీలు తమ అధికారిక లెటర్హెడ్లను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడాలని, ఫోన్లో మాట్లాడే ప్రతీ ఒక్కరితో గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.
ప్రతిపక్ష సభ్యులతో సహా తోటి ఎంపీలందరి నుంచి విషయాలను నేర్చుకోవాలని, సభకు 100 శాతం హాజరు సాధించేలా వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు.
నిద్ర, జెట్ లాగ్పై ఆసక్తికర వ్యాఖ్యలు..
సమావేశంలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ తన వ్యక్తిగత అలవాట్లపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నేను మంచం మీదకు వెళ్లిన ఎనిమిది సెకన్లలోపే నిద్రపోతాను. రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోతాను” అని తెలిపారు.
ఇటీవల ఆప్ను వీడి బీజేపీలో చేరిన అశోక్ మిట్టల్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “ప్రస్తుతం నేను మీతో ఉన్నాను, కాబట్టి నేను మరే విషయం గురించి ఆలోచించడం లేదు. ఉన్న క్షణంలోనే జీవిస్తాను. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి” అని అన్నారు.
విదేశీ పర్యటనల్లో జెట్ లాగ్ను ఎలా ఎదుర్కొంటారని అడగ్గా, విమానం ఎక్కిన వెంటనే తాను ప్రయాణిస్తున్న దేశ సమయానికి గడియారాన్ని మార్చుకుంటానని, దానివల్ల ఎలాంటి సమస్య రాదని చెప్పారు.
ఎన్డీఏలో పెరిగిన బలం..
ఈ సమావేశంలో పాల్గొన్న కొత్త ఎంపీలలో ఇటీవల బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్ కూడా ఉన్నారు. గత సమావేశానికి, ప్రస్తుత సమావేశానికి మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేడీలకు చెందిన పలువురు ఎంపీలు ఎన్డీఏలో చేరారు.
రాఘవ్ చద్దా నేతృత్వంలో ఆప్కు చెందిన 7 గురు ఎంపీలు, టీఎంసీకి చెందిన ముగ్గురు ఎంపీలు (సుష్మితా దేవ్, సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాష్ చిక్ బరైక్) తమ స్థానాలకు రాజీనామా చేసి బీజేపీలో చేరి సభలోకి ప్రవేశించారు.










