Khushbu Slams Udayanidhi తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దమ్ముంటే ముఖ్యమంత్రి విజయ్తో నేరుగా రాజకీయ పోరాటం చేయాలని, అనవసరంగా మహిళలను రాజకీయాల్లోకి లాగవద్దని ఉదయనిధికి ఘాటుగా హెచ్చరించారు.
“మగాడివైతే విజయ్తో తలపడు”..
ఈ వివాదంపై మీడియాతో మాట్లాడిన ఖుష్బూ.. ఉదయనిధి శైలిపై నిప్పులు చెరిగారు. “రాజకీయాల్లో విభేదాలు రావడం సహజం. నీకు సీఎం విజయ్తో సమస్యలు ఉంటే ఆయనతోనే తేల్చుకో. నిజంగా మగాడివైతే త్యాగరాజనగర్లో విజయ్తో నేరుగా తలపడు.
అంతేకానీ, ఎలాంటి సంబంధం లేని నటి త్రిషను రాజకీయాల్లోకి లాగి అసభ్యంగా మాట్లాడటం నీచమైన మనస్తత్వానికి నిదర్శనం. మహిళలను గౌరవించడం డీఎంకే సంస్కృతిలోనే లేదు, వారి రక్తంలోనే మహిళలను అవమానించే గుణం ఉంది.”
గతంలో అసెంబ్లీలో జయలలితను, ఆ తర్వాత శశికళను కూడా డీఎంకే నేతలు అవమానించారని ఆమె ఆరోపించారు. మహిళల పట్ల డీఎంకే నేతల చౌకబారు ఆలోచనలకు ఈ ఘటన మరొక నిదర్శనమని, ఉదయనిధి తక్షణమే త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉదయనిధి అరెస్ట్ – స్టేషన్ బెయిల్..
కావేరి జలాల కోసం జరిగిన నిరసన ప్రదర్శనలో సీఎం విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో ఉదయనిధి త్రిష పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదులు అందడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి ఉదయనిధిని అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఆయన స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. ఖుష్బూతో పాటు పలువురు మహిళా నేతలు, సినీ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండటంతో ఈ వివాదం డీఎంకేకు రాజకీయంగా తీవ్ర తలనొప్పిగా మారింది.











