Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > యూపీఐ ఛార్జీలపై అమెరికా ఒత్తిడి.. ఖండించిన కేంద్రం!

యూపీఐ ఛార్జీలపై అమెరికా ఒత్తిడి.. ఖండించిన కేంద్రం!

Centre Rejects Foreign Influence Claims On UPI MDR Charges యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేదా విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టత ఇచ్చింది.

భారత్‌లో యూపీఐకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలన్నీ పూర్తి స్వతంత్రంగానే తీసుకుంటామని, సాధారణ వినియోగదారులకు (Consumers) యూపీఐ సేవలు ఎప్పటికీ సంపూర్ణంగా ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. అత్మనిర్భర్, పటిష్టమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థను రూపొందించే లక్ష్యంతోనే నిర్ణయాలు ఉంటాయి తప్ప, విదేశీ ప్రయోజనాల కోసం కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.

విపక్షాల తీవ్ర ఆరోపణలు.. కేంద్రం వివరణ..

యూపీఐపై 0.4% MDR విధించడం వెనుక అమెరికన్ కార్డ్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే కుట్ర ఉందంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. దీనిని “నరేంద్రుడి ట్రంప్ సంతృప్తికరణ చర్య” (Narendra’s Ongoing Trump Appeasement) అని ఆయన అభివర్ణించారు.

డెబిట్ కార్డులపై ఉండే 0.4% ఎమ్‌డీఆర్‌ను యూపీఐకి వర్తింపజేయడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా అని జైరాం రమేష్ ప్రశ్నించారు. యూపీఐ ఉచితంగా అందించడాన్ని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ గతంలో తప్పుబట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

కేంద్రం స్పష్టత..

విదేశీ ప్రభావం ఉందనే వాదన పూర్తిగా అసత్యమని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రజలు తమ స్నేహితులకు డబ్బులు పంపాలన్నా, షాపుల్లో స్క్రాచ్/క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించినా ఎలాంటి రుసుములు ఉండవని వెల్లడించింది.

కస్టమర్లపై భారం పడకుండా చర్యలు..

వ్యాపారులు ఈ MDR రుసుమును వినియోగదారుల బిల్లులో కలిపి వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొత్త ఎమ్‌డీఆర్ నిబంధనలు ఇవే..

అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4% MDR అమల్లోకి వస్తుంది. నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు పొందే వర్తకులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ రూ. 10,000 చెల్లిస్తే వ్యాపారి రూ. 40 ఎమ్‌డీఆర్ ఫీజుగా చెల్లిస్తారు. ఒక్కో లావాదేవీకి ఎమ్‌డీఆర్ ఫీజు గరిష్టంగా రూ. 300 గా నిర్ణయించారు.

అయితే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి (P2P) జరిగే నగదు బదిలీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions