Nirmala Sitharaman Call To Gen Z Gen Alpha యువత దేశం తమకేం చేసిందనేది కాకుండా, తాము దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ‘జెన్ జెడ్’ (Gen Z), ‘జెన్ ఆల్ఫా’ (Gen Alpha) తరాలు నాయకత్వ బాధ్యతలు చేపట్టి, దేశ ప్రయోజనాలను ముందు ఉంచాలని ఆమె ఉద్బోధించారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాత్కోత్సవం (Convocation)లో మంగళవారం పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలి..
“మిమ్మల్ని జెన్ జెడ్ అని పిలిచినా, జెన్ ఆల్ఫా అని పిలిచినా.. మీ ఆకాంక్షలను వినడానికి దేశం సిద్ధంగా ఉంది. అయితే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ, బాధ్యతాయుతమైన పౌరులుగా దేశానికి మీరేం చేయగలరో ఆలోచించాలి” అని స్పష్టం చేశారు.
ఆయా రంగాల్లో విద్యార్థులు నాయకత్వాన్ని స్వీకరించాలని, దేశ ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీపడకూడదని చెప్పారు. దేశం సురక్షితంగా, బలంగా ఉంటేనే మన ఉనికి ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రజలు నివాసాలు కోల్పోతున్న వైనాన్ని గుర్తుచేశారు.
భారత్ ఆర్థిక స్థిరత్వం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభాల వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాపై ప్రభావం పడి ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఏర్పడినా.. భారత్ మాత్రం 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వమే దీనికి కారణమని కొనియాడారు.
తమిళనాడు పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో గ్లోబల్ హబ్గా ఎదుగుతోందని ప్రశంసించారు. శ్రీపెరంబుదూర్-ఓరగాడమ్ కారిడార్ ఆటోమొబైల్, స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలో 350 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) ఉన్నాయని పేర్కొన్నారు.
సైన్స్, టెక్నాలజీ (STEM) రంగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రతీ జిల్లాలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. తిరుక్కురళ్ పద్యాలను ఉటంకిస్తూ విద్యార్థులు అహంకారాన్ని వీడి, వినయంతో, ఓపికతో సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు.











