CM Chandrababu Fires On Collectors ప్రభుత్వ దస్త్రాల (ఫైళ్ల) పరిష్కారంలో జాప్యాన్ని ఏమాత్రం సహించేది లేదని, పాలనలో వేగాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పరిపాలనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆన్లైన్ ఫైళ్ల నిర్వహణ…
నెల రోజుల్లో అన్ని శాఖల దస్త్రాలను పూర్తిగా ఆన్లైన్లోకి మార్చాలని సీఎం స్పష్టం చేశారు. ఇకపై భౌతిక (మాన్యువల్) ఫైళ్ల నిర్వహణను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. కలెక్టర్ల సమావేశానికి కొందరు ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, వారి నుంచి వివరణ తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ను ఆదేశించారు.
ఐఏఎస్ అధికారుల పనితీరును అంచనా వేసేందుకు 360 డిగ్రీల నివేదికను రూపొందిస్తామని, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు.
స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బందికి జాబ్ ఛార్ట్..
గ్రామ, వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పనిభారాన్ని హేతుబద్ధీకరించి, ప్రతి ఉద్యోగికి విధులు స్పష్టం చేస్తూ జాబ్ ఛార్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అందించాలని సూచించారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మండల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తే సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని, ఇకపై ఈ పర్యటనల వివరాలను సమర్పించాలని ఆదేశించారు.











