- మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరిక..
- గచ్చిబౌలి సభపై సంచలన వ్యాఖ్యలు!
Minister Ponnam Prabhakar Comments On Pawan Kalyan జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది.
ఈ సభపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటుగా స్పందించారు. గతంలో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పొన్నం ఫైర్ః సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా గట్టిగా గుర్తు చేశారు.
“తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయి” అంటూ తెలంగాణ సమాజంపై విషం కక్కిన పవన్ కళ్యాణ్, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ నవ నిర్మాణ సభ పెడుతున్నారని మంత్రి ప్రశ్నించారు.
“తెలంగాణ ఏర్పడితే తాను 11 రోజులు అన్నం మానేశాను” అని బహిరంగంగా చెప్పుకున్న వ్యక్తి.. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం సభలు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని మండిపడ్డారు.
తెలంగాణలో సరికొత్త రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి, ఇక్కడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడటం కోసమే బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పవన్ కళ్యాణ్ ఈ కొత్త నటన మొదలుపెట్టారని ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండానే మోస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ను, అస్తిత్వాన్ని గౌరవించేవారెవరూ ఈ సభకు వెళ్లరని చెబుతూ.. “తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డా గచ్చిబౌలిలో జరిగే పవన్ కళ్యాణ్ సభకు వెళ్లరు” అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి.











