- మాజీ ఉద్యోగితో రూ. 6 లక్షలకు సుపారీ!
Woman Plots Father–In–Law‘s Murder ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో వ్యాపారి వినీత్ మిణోచా దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంటిపై సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా పెట్టడం, ఆర్థిక ఆంక్షలు విధించడమే ఈ హత్యకు ప్రధాన కారణమని తేలింది. ఈ దారుణానికి వినీత్ సొంత కోడలు షాలూయే మాజీ ఉద్యోగితో కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
శనివారం రాత్రి వినీత్ కుమారుడు, కోడలు షాలూ పార్టీకి వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగింది. మాజీ ఉద్యోగి విశాల్ గౌతమ్ తన సహచరుడితో కలిసి డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి ప్రవేశించాడు. మొదట దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాలనుకున్నా, ఎదురెదురు పడటంతో కత్తితో గొంతు కోసి హత్య చేశారు.
పార్టీలో కోడలి సాధారణ ప్రవర్తన..
ఇంట్లో మామగారు హత్యకు గురవుతుంటే, కోడలు షాలూ తన భర్తతో కలిసి లౌంజ్లో తెల్లవారుజామున 3 గంటల వరకు సాధారణంగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. మే 1 నుంచి హత్య జరిగిన రోజు వరకు కోడలు షాలూ, మాజీ ఉద్యోగి విశాల్ మధ్య 309 సార్లు కాల్స్, మెసేజ్లు జరిగినట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. అందులో 49 డిలీట్ చేసిన మెసేజ్లను పోలీసులు రికవర్ చేస్తున్నారు.
రూ. 6 లక్షలకు సుపారీ..
మామను తుదముట్టించేందుకు కోడలు షాలూ రూ. 6 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్గా రూ. 2 లక్షలు, హత్య తర్వాత రూ. 4 లక్షలు ఇచ్చేలా డీల్ చేసుకున్నారు. ఇంట్లో వస్తువులు, నగదు ఏమీ పోకపోవడంతో కుటుంబ కలహాలపై అనుమానం వచ్చిన పోలీసులు, సీసీటీవీ దృశ్యాలు మరియు కాల్ డేటా ఆధారంగా కోడలు షాలూను మంగళవారం అరెస్ట్ చేశారు.








