BRS MLAs Suspended తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల మూడో రోజు సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలతో సభను అడ్డుకున్నారు.
స్పీకర్ వారించినా వినకపోవడంతో, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
బీఆరెస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా బీఆర్ఎస్ సభ్యులందరూ సస్పెండ్ అయ్యారు.
సస్పెన్షన్ అనంతరం స్పీకర్ను కలిసేందుకు వెళ్లిన విపక్ష ఎమ్మెల్యేలను మార్షల్స్ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు..
కాంగ్రెస్ దళిత ప్రజాప్రతినిధులు నిరసన తెలపి వెళ్లిన ప్రాంతాన్ని పేడ, పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందని, బీఆర్ఎస్ నేతల దొరతనం పోకడలను మరియు కుల వివక్షను రాష్ట్రం భరించదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.









