తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ప్రజలకు సాధించిపెట్టిందేమీ లేదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా తీరును తప్పుబడుతూ కవిత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ఎవరి పొట్టా నింపలేదని, ప్రజల జీవితాలను బాగుచేసింది లేదని ఆరోపించారు. HYDRA పేరుతో ఇండ్ల కూల్చివేతలు చేపడుతూ పేదల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.
గురుకులాల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయని, ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రోజురోజుకూ హత్యలు, నేరాలు ఎక్కువవుతున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్కు కౌంట్డౌన్ షురూ..
ఉద్యమకారుల నెత్తురు చిందిన రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, ఈ ప్రభుత్వానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రజా వ్యతిరేక ఆగడాలను అడ్డుకుంటామని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని సాగనివ్వబోమని స్పష్టం చేశారు.











