PM Modi On GDP Growth | దేశ ఆర్థిక వ్యవస్థ 2026-27 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 7.8 శాతం ఊహించని రీతిలో వృద్ధి సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయాలు ఉన్నప్పటికీ భారతదేశం వేగంగా ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు.
కిర్గిజిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని, మంగళవారం ఉదయం ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు, సేవలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
‘వెడ్ ఇన్ ఇండియా’ – ప్రధాని మోదీ సూచనలు..
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని ప్రజలకు పలు కీలక విజ్ఞప్తులు చేశారు. పర్యటనల కోసం అనవసరంగా విదేశీ దేశాలకు వెళ్లవద్దని పౌరులకు సూచించారు. విదేశాల్లో వేడుకగా నిర్వహించే డెస్టినేషన్ వెడ్డింగ్స్ను విడనాడి, ‘వెడ్ ఇన్ ఇండియా’ (భారతదేశంలోనే పెళ్లి చేసుకోండి) నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
అవసరం లేకపోతే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు బంగారం కొనుగోలు చేయడం మానుకోవాలని చెప్పారు. మనమందరం స్వదేశీ వస్తువులు, సేవలను ఎక్కువగా ఉపయోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్ల నాటికి (2047) భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇంధన పొదుపు, ఇ-వాహనాల వాడకంపై దృష్టి..
అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ ఏడాది మే నెలలో కూడా ప్రధాని పలు సూచనలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అవసరమైన చోట ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతిని, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రజలకు సూచించారు.











