PM Modi Khelo India Dialogue ఒలింపిక్ క్రీడలలోని వివిధ విభాగాల్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అనేక క్రీడాంశాల్లో పోటీపడకపోవడం వల్ల పతకాల సంఖ్య గణనీయంగా పెరగడం లేదని, ఇది ఒక “చేదు నిజం” అని పేర్కొన్నారు.
ఆగస్టు 29న జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవానికి ముందు గురువారం నాడు నిర్వహించిన ‘ఖేలో ఇండియా డైలాగ్’ (Khelo India Dialogue) వర్చువల్ సమావేశంలో ఆయన క్రీడాకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ గాంధీనగర్ నుండి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా పాల్గొన్నారు.
సాంప్రదాయ క్రీడలకే పరిమితం కాకూడదు..
సగం క్రీడల్లోనే భాగస్వామ్యం: 2024 పారిస్ ఒలింపిక్స్లోని 32 క్రీడా విభాగాల్లో భారత్ కేవలం 16 క్రీడల్లో మాత్రమే పోటీ పడిందని, 2012లో కేవలం 13 క్రీడల్లోనే పాల్గొందని మోదీ గుర్తుచేశారు. సగానికి పైగా క్రీడల్లో మన ఉనికి లేకపోవడం వల్ల పతకాల పట్టికలో అత్యధిక వాటా సాధించలేకపోతున్నామని వివరించారు. భారత్లో ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, పర్వత ప్రాంతాలను ఉపయోగించుకుని సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ వంటి నూతన క్రీడల్లో ప్రతిభను తీర్చిదిద్దాలని సూచించారు.
పిల్లల కోసం ప్రతిభాన్వేషణ..
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా మరియు దేశంలో క్రీడల భాగస్వామ్యాన్ని పెంచడానికి 5 నుండి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం దేశవ్యాప్త ప్రతిభాన్వేషణను మోదీ ప్రకటించారు. క్రీడలు కేవలం పతకాలకే కాక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడతాయని చెప్తూ, “స్క్రీన్ల కంటే క్రీడా కేంద్రాలకే, ప్లే స్టేషన్ల కంటే ఆట స్థలాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి” అని యువతకు మోదీ హితవు పలికారు. పారా అథ్లెట్లు శీతల్ దేవి, అవనీ లేఖర, ఝండు కుమార్, సుమిత్ అంటిల్ వంటి వారిని స్ఫూర్తిప్రదాతలుగా ప్రధాని కొనియాడారు.











