- పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలకు బీజేపీ మద్దతు
BJP Supports Polytechnic Students Protest కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 97 (GO 97)తో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్న ఈ జీవోను తక్షణమే బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నేతల అక్రమ అరెస్టులపై మండిపాటు..
రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల న్యాయమైన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రతిపాదించే ‘ప్రజా పాలన’ కాదని, అది పూర్తిగా ‘పోలీసుల నిర్బంధ పాలన’ అని ఆయన విమర్శించారు. ఇందిరాపార్క్, మాసాబ్ట్యాంక్, రామంతపూర్ మొదలుకొని వనపర్తి, పరకాల వరకు విద్యార్థులు శాంతియుతంగా రోడ్లెక్కి నిరసన తెలుపుతుంటే, వారిపై లాఠీఛార్జీలు చేయించడం, అరెస్టులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు.
రాహుల్ గాంధీపై విమర్శలు..
రాజ్యాంగ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యార్థుల హక్కులను కాలరాస్తుంటే ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
విద్యార్థుల ఈసెట్ (ECET) అవకాశాలకు గండి..
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ‘ఈసెట్’ అవకాశాలను దూరం చేసే కుట్రలు రేవంత్ రెడ్డి సర్కార్ విరమించుకోవాలని సూచించారు.
కంటితుడుపు కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే జీవో 97ను రద్దు చేయాలని, తెలంగాణ విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి రాజీలేని పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.











