Friday 21st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!

cm revanth reddy

Revanth Reddy US Visit Cancelled తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది.

“రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించబడింది” అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేయడంతో సీఎం తన యూఎస్ఏ పర్యటనను రద్దు చేసుకుని లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమావళి, విధానపరమైన ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారి యూకే మరియు అమెరికా పర్యటనలకు కేంద్ర అనుమతి కోరింది.

కేంద్రం తొలుత కేవలం యూకే పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అధికారిక ప్రతినిధి బృందం యూకే చేరుకున్న తర్వాత, అమెరికా పర్యటనకు ఆమోదం తెలపడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

లండన్ నుంచే తిరుగుపయనం: కేంద్ర నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని బోస్టన్ పర్యటనను రద్దు చేసుకుని, లండన్ నుంచే నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి పర్యటన రద్దయినప్పటికీ, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో నిర్వహించాల్సిన సమావేశాలు, ఒప్పందాలను (MoUs) అధికారుల బృందం యథావిధిగా కొనసాగించి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విస్మయం..

తెలంగాణ విద్యా రంగ అభివృద్ధికి, ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి తోడ్పడే పర్యటనకు “రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం” పట్ల సీఎం తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర నిర్ణయాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు.

“కేంద్ర నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను, విద్యాసంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఉన్నత విద్య, నైపుణ్యాలు పొందాలనే మన యువత కలలకు ఇది సమాధానంగా నిలిచేది” అని సీఎం తెలిపారు.

“దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉస్మానియా, హెచ్‌సీయూ, జేఎన్టీయూల నుంచి ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థలు నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా మార్చాయని, రాబోయే రోజుల్లో ప్రపంచ విఖ్యాత విద్యా సంస్థలకు హైదరాబాద్‌ను అడ్డాగా మారుస్తామని చెప్పారు.

“చాలామంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు, కానీ నేను ప్రపంచంలోని హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, ఎల్‌బీఎస్, ఎల్‌ఎస్‌ఈ వంటి అత్యుత్తమ విద్యా సంస్థల విద్యను ఇక్కడి సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థలనే భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను” అని స్పష్టం చేశారు.

యూకేలో పర్యటన కొనసాగింపు..

షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి యూకేలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలను సందర్శించి వారి ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అలాగే ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన నేతలతో భేటీ అయి తెలంగాణతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేయనున్నారు.

You may also like
telangana high court
ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి!
Ponnam Prabhakar
బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ!
Rent A Boy Friend: అమ్మాయికు సీపీ సజ్జనర్ హెచ్చరిక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions