Allu Arjun Fans Meet | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో అభిమానులకు కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్ సంస్కృతిపై స్పందిస్తూ, నచ్చని వ్యక్తుల గురించి సమయం వృథా చేయడం కంటే మనకు నచ్చిన పనిపై దృష్టి పెట్టడం ఉత్తమం అని సూచించారు.
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులతో సమావేశమైన అల్లు అర్జున్, వారితో ఆప్యాయంగా ముచ్చటించి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నన్ను ప్రేమించే అభిమానులకే కాదు, నన్ను ద్వేషించే వారికీ కూడా ఒకటే చెబుతున్నా.
ఒకరిని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనకు నచ్చని వాళ్ల కోసం సమయం, డబ్బు, శక్తిని ఎందుకు ఖర్చు చేయాలి? సోషల్ మీడియాలో ట్రోల్స్కు స్పందించడం కంటే ఆ సమయాన్ని మీ ఎదుగుదలకు ఉపయోగించండి” అని అన్నారు.
అంతేకాకుండా, “మీకు నచ్చిన పని చేసుకోండి. జీవితాన్ని ఆస్వాదించండి. ఎవరినీ ట్రోల్ చేయకండి. మన రోజులో ఉన్న సమయాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం” అంటూ అభిమానులకు సూచించారు.
జగన్నాథుడి విగ్రహం స్వీకరించే ముందు..
ఈ కార్యక్రమంలో మరో సంఘటన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఓ అభిమాని అల్లు అర్జున్కు పూరి జగన్నాథుడి విగ్రహాన్ని బహూకరించారు. విగ్రహాన్ని స్వీకరించే ముందు ఆయన చెప్పులు విప్పి, భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రతిమను అందుకున్నారు.
ఈ చర్యను అభిమానులు భారతీయ సంప్రదాయాల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ ప్రశంసిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీగా బన్నీ..
ప్రస్తుతం అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ‘రాకాలో’ నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు రూపొందిస్తోంది.
అనంతరం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ చిత్రంలో నటించనున్నారు. అలాగే మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్తోనూ మరో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.











