Congress Vande Mataram Row | తమ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలనే పాడాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ తీవ్రమైన ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాన్ని సూచిస్తోందని, దేశ స్వాతంత్య్ర సమరయోధులను అవమానించడమేనని విమర్శించారు. 1937లో కాంగ్రెస్ చేసిన ఈ తప్పిదమే భారతదేశ విభజనకు పునాది వేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పూర్తిస్థాయిలో ఆలపించేలా కొత్త మార్గదర్శకాలు తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఈ విమర్శలను తిరస్కరించింది. 1937లో మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి దిగ్గజ నాయకుల సమక్షంలో ఆమోదించిన తీర్మానాన్నే తాము పాటిస్తున్నామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ వేదికలపై మొదటి రెండు చరణాలు పాడాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.











