Wednesday 19th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎలక్ట్రిక్ ఫ్లైట్‌తో సంచలనం సృష్టించిన అమెరికా సంస్థ!

ఎలక్ట్రిక్ ఫ్లైట్‌తో సంచలనం సృష్టించిన అమెరికా సంస్థ!

కేవలం రూ.500తో 27 నిమిషాల ప్రయాణం

ఒక కప్పు కాఫీ ఖరీదు కంటే తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం సాధ్యమేనా? అమెరికాకు చెందిన విమానయాన సంస్థ హార్ట్ ఏరోస్పేస్ ఇటీవల నిర్వహించిన ఒక పరీక్షా ప్రయోగం ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

కంపెనీ తన పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విమానం ‘X1’ను తొలిసారిగా పరీక్షించింది. బ్యాటరీ శక్తితో మాత్రమే నడిచిన ఈ విమానం, 27 నిమిషాల పాటు గగనవిహారం చేసేందుకు కేవలం $5 (సుమారు రూ.500) విలువైన విద్యుత్‌ను వినియోగించింది.

న్యూయార్క్‌లోని ఒక ప్రాంతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం, ఒకే పైలట్‌తో 1,100 అడుగుల ఎత్తుకు ఎగిరి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

బస్సు బరువున్న భారీ విమానం

X1 ఏదో చిన్న ప్రయోగాత్మక విమానం కాదు. దీని రెక్కల వెడల్పు 106 అడుగులు, పొడవు 76 అడుగులు ఉండగా, బరువు 25,000 పౌండ్లకు పైనే – అంటే దాదాపు ఒక ఖాళీ స్కూల్ బస్సుతో సమానం.

అయితే, ఈ $5 ఖర్చు కేవలం విద్యుత్ వినియోగానికి సంబంధించినదేనని, పైలట్ జీతాలు, నిర్వహణ, బీమా వంటి ఇతర ఖర్చులు ఇందులో లేవని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో టిక్కెట్ ధరలు వెంటనే తగ్గుతాయని భావించలేమని నిపుణులు చెబుతున్నారు.

2031 నాటికి 30 సీట్ల హైబ్రిడ్ విమానం

ఈ పరీక్ష ఫలితాలను హార్ట్ ఏరోస్పేస్ తమ ES-30 హైబ్రిడ్-ఎలక్ట్రిక్ విమానం కోసం వినియోగించనుంది. 2031 నాటికి సేవల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ 30 సీట్ల విమానం, సంప్రదాయ ప్రాంతీయ విమానాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 40 శాతానికిపైగా తగ్గించనున్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది. యునైటెడ్, ఎయిర్ కెనడా వంటి సంస్థలు ఇప్పటికే ఈ విమానంపై ఆసక్తి చూపుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions