- కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ!
Free Power For Ganesh Pandals | కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరింత కళకళలాడనున్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసే దాదాపు 2,000 గణేష్ మండపాలన్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఛార్జీలు భరించనున్న కార్పొరేషన్..
మండపాల నిర్వాహకులపై ఎలాంటి భారం పడకుండా, విద్యుత్ ఛార్జీల మొత్తాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషనే భరించనుందని బండి సంజయ్ తెలిపారు. దీంతో గణేష్ ఉత్సవాల నిర్వహణలో మండపాల కమిటీలకు కొంత ఆర్థిక భారం తగ్గనుంది.
మూడేళ్లుగా సొంత ఖర్చుతో..
గత మూడేళ్లుగా గణేష్ మండపాలకు అయ్యే విద్యుత్ ఖర్చును తానే వ్యక్తిగతంగా భరిస్తున్నట్లు బండి సంజయ్ గుర్తు చేశారు. ఈసారి కూడా అదే స్ఫూర్తితో, కార్పొరేషన్ ద్వారా భక్తులకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు.
వినాయక చవితి వేడుకలను భక్తులంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రకటనతో కరీంనగర్లోని గణేష్ మండపాల నిర్వాహకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏటా విద్యుత్ బిల్లుల భారంతో సతమతమయ్యే చిన్న కమిటీలకు ఇది ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. నగరవ్యాప్తంగా వేలాది మండపాల ఏర్పాటుకు ఇది మరింత ప్రోత్సాహాన్నివ్వనుంది.











