Prince Rahim Aga Khan V Meets CM Revanth Reddy షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ ఆధ్యాత్మిక నాయకుడు, అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) చైర్మన్ ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ V తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలసి కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్రంలో ఏకేడీఎన్ ప్రాజెక్టులు, భవిష్యత్ భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు.
తొలి అధికారిక పర్యటన…
2025లో తన తండ్రి అగాఖాన్ IV స్థానంలో ఆధ్యాత్మిక పీఠాన్ని చేపట్టిన తర్వాత ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ V భారతదేశానికి వచ్చిన తొలి అధికారిక పర్యటన ఇది. సాంస్కృతిక పరిరక్షణ, విద్య, మరియు సమాజ అభివృద్ధి రంగాలలో ఏకేడీఎన్ నెట్వర్క్ దశాబ్దాలుగా నగరంలో క్రియాశీలకంగా పనిచేస్తోంది.
హైదరాబాద్లోని చారిత్రాత్మక కుతుబ్ షాహీ సమాధుల (Qutb Shahi Tombs) కాంప్లెక్స్ జీర్ణోద్ధరణ ప్రక్రియను ‘అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ విజయవంతంగా చేపట్టింది. పాలన, పర్యాటకం మరియు ఇతర అభివృద్ధి రంగాలలో తెలంగాణ ప్రభుత్వంతో ఏకేడీఎన్ నెట్వర్క్ పరస్పర సహకారాన్ని అందించే అంశాలపై సమావేశంలో దృష్టి సారించారు.











