KTR Demands Apology From CM Revanth | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొన్నటిదాకా 1,000 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్హౌజ్ ఉందంటూ కంపు నోటితో బురదజల్లిన రేవంత్ రెడ్డి, నిన్న శాసనసభ సాక్షిగా కేవలం 67 ఎకరాలు మాత్రమేనని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
ఇన్నాళ్లూ వెయ్యి ఎకరాలంటూ అసత్య ప్రచారాలు చేసినందుకు కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు.
ఆస్తులపై జడ్జితో విచారణకు సిద్ధమా?
కేసీఆర్ పుట్టిన నాటి నుంచి నేటిదాకా తమ కుటుంబ ఆస్తులు ఎన్ని? రేవంత్ రెడ్డి పుట్టిన నాటి నుంచి నేటిదాకా ఆయన కుటుంబ ఆస్తులు ఎన్ని? అనే దానిపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధమని, రేవంత్ రెడ్డి సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రతి ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు స్పష్టంగా పొందుపరిచారని తెలిపారు. కేసీఆర్కు మొదటి నుంచి వ్యవసాయం అంటే మక్కువని, భూమిని దేవతలా పూజిస్తారని పేర్కొన్నారు. చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూములపై బురదజల్లబోయి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు.
కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేదని, కేసీఆర్ పుట్టినప్పుడే వాళ్ల ఇల్లు రెండు ఎకరాల్లో ఉండేదని గుర్తుచేశారు. ఆఖరికి చింతమడకలోని ఆ రెండెకరాల ఇల్లును కూడా ప్రభుత్వ పాఠశాలకే రాసిచ్చిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు.
మైసూరు బోండా సామెతతో ఎద్దేవా..
“ప్రగతి భవన్లో 150 బెడ్ రూంలు, బంగారు బాత్రూంలు ఉన్నాయని గతంలో చేసిన చిల్లర వ్యాఖ్యలు ఎంత నిజమో, నిన్నటి రేవంత్ ఆరోపణలు అంతే నిజం. ఆరు గ్యారంటీల అమలులో ఎంత నిజముందో, రేవంత్ మాటల్లోనూ అంతే నిజముంది. చివరికి మైసూరు బోండాలో ఎంత మైసూరు ఉంటుందో.. నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో కూడా అంతే నిజం ఉందంటూ” కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.











