– జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు!
– జగిత్యాల రాజకీయాల్లో మారిన సమీకరణాలు..
Revanth Reddy comments Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, జీవన్ రెడ్డి రాజకీయ చరిత్రను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో టీడీపిలో ఎక్సైజ్ మం-త్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి.. ఆ తర్వాత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావుతో జట్టు కట్టిన మాట నిజం కాదా?” అని రేవంత్ ప్రశ్నించారు.
నాదెండ్లను వదిలి కాంగ్రెస్లోకి వచ్చాక, పార్టీ ఆయనకు 15 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. జగిత్యాల కార్యకర్తలు 40 ఏళ్లుగా ఆయన కోసం నిస్వార్థంగా పనిచేశారని పేర్కొన్నారు.
జగిత్యాలలో ఓడిపోయినా గౌరవించి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చామని, కానీ పదవి లేని ఏడాది కాలంలోనే ఆయన తట్టుకోలేక పార్టీ మారారని విమర్శించారు.
తెలంగాణలో ప్రజా పాలన పోవాలని, కేసీఆర్ పాలన రావాలని జీవన్ రెడ్డి కోరుకోవడం విచారకరమని.. కేసీఆర్ పాలనను ‘పాపాల భైరవుడి పాలన’గా రేవంత్ అభివర్ణించారు.
మారుతున్న జగిత్యాల రాజకీయం..
40 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి, కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడం.. దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.







