Md Azharuddin Takes Oath as MLC | తెలంగాణలో గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.
సోమవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నప్పటికీ, ఆయనకు అసెంబ్లీ లేదా మండలిలో సభ్యత్వం లేదు.
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు సభలో సభ్యత్వం పొందకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. ఈ నెల ఆఖరుతో ఆ గడువు ముగియనున్న తరుణంలో, తాజా నియామకంతో ఆయన మంత్రి పదవిపై నెలకొన్న నీలి నీడలు తొలగిపోయాయి.
గతంలో రాష్ట్ర క్యాబినెట్ వీరి పేర్లను సిఫార్సు చేసినా, సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి.
తాజాగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వీరి పేర్లను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది.
తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం మండలిలో అడుగుపెట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.










