RSS Chief Mohan Bhagwat On Youth | మారుతున్న సామాజిక పరిస్థితుల్లో నేటి తరం యువతలో ప్రశ్నలడిగే తత్వం పెరిగిందని, పూర్వం ఉన్నట్లుగా గుడ్డిగా ఆజ్ఞలను పాటించే రోజులు పోయాయని ఆర్ఎస్ఎస్ (RSS) అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
శుక్రవారం న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో విశ్వ మాంగల్య సభ నిర్వహించిన ‘నేటి సమాజంలో మాతృత్వం’ జాతీయ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
“పూర్వంలా విధేయత చూపే కాలం కాదిది”
తమ చిన్ననాటి రోజులను ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్దల మాటలను ప్రశ్నించకుండా పాటించే ‘విధేయత యగం’ నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి.
నేటి యువత ప్రతీ విషయానికీ ప్రశ్నలు అడుగుతున్నారు, స్పష్టమైన వివరణలను కోరుకుంటున్నారు. వారికి ఏ విషయాన్నైనా ప్రేమతో, కారణాలు వివరిస్తూ అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది.” అని పేర్కొన్నారు మోహన్ భగవత్.
కుటుంబాల్లో సంభాషణలు పునరుద్ధరించాలి..
ఇళ్లలో పెద్దలు పిల్లలతో సమయం గడపడం తగ్గడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు నిలిచిపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రేమ, ఆప్యాయతలతో కూడిన బలమైన సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని యువతతో క్రమం తప్పకుండా మాట్లాడాలని, వారితో ఎక్కువ సమయం గడపాలని పిలుపునిచ్చారు.
మాతృత్వమే మానవ నాగరికతకు పునాది..
మానవ జీవిత సృష్టికి, నిర్వహణకు మరియు తర్వాతి తరాల మనుగడకు మాతృత్వం అత్యంత కీలకమైనదని మోహన్ భగవత్ కొనియాడారు.
మానవ నాగరికత నిలబడటానికి మాతృత్వమే ప్రధాన పునాది అని, తరతరాలుగా సమాజాన్ని ముందుకు నడిపించడంలో తల్లి పాత్ర అద్వితీయమైనదని ఆయన స్పష్టం చేశారు.











