- ప్రశంసించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు
Kiren Rijiju on Dharmendra Pradhan Resignation | నీట్ (NEET-UG 2026) పేపర్ లీక్ వివాదం మరియు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం తొలి బహిరంగ స్పందనను వెలువరించింది.
కేంద్ర సభా వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, విద్యా రంగానికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రజా జీవితం, విద్యార్థుల సంక్షేమానికి చేసిన కృషి నిదర్శనంగా నిలుస్తుందని అభివర్ణించారు.
“నిజమైన నాయకత్వాన్ని దశాబ్దాల పాటు కొలుస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి ప్రస్థానం ప్రజా జీవితం మరియు విద్యార్థుల సంక్షేమంతో జీవితాంతం మమేకమవ్వడానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది” అని రిజిజు పేర్కొన్నారు.
“కేంద్ర మంత్రివర్గంలో ఆయనతో కలిసి పనిచేసినందున, భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, యువ విద్యార్థుల ప్రయోజనాలను ప్రతి నిర్ణయానికి కేంద్రంగా ఉంచడానికి ఆయన చూపిన చిత్తశుద్ధిని నేను స్వయంగా చూశాను. ఇలాంటి కీలక రంగాన్ని ధైర్యంతో, స్పష్టమైన దార్శనికతతో నడిపించారు.
విద్యా సంస్కరణల కోసం శ్రమించిన ప్రధాన్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ఇదే దృఢ సంకల్పంతో మీరు దేశానికి సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.
రాజీనామా వెనుక ప్రధాన్ వివరణ..
రాజీనామా నిర్ణయాన్ని వెల్లడిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కూడా X లో సుదీర్ఘ లేఖను పంచుకున్నారు. ఇది తనకు ‘వ్యక్తిగత ప్రతిష్ట’కు సంబంధించిన విషయం కాదని, గత 10 రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో తాను తీవ్రంగా కలత చెందానని తెలిపారు.
“నీట్ పేపర్ లీక్కు నేను మొదటి రోజు నుంచే బాధ్యత తీసుకున్నాను. జంతర్ మంతర్ వద్ద నెలకొన్న పరిస్థితిని ‘దేశ వ్యతిరేక శక్తులు’ తమ రాజకీయ లబ్ధికి వాడుకోకూడదనే ఉద్దేశంతోనే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నా రాజీనామా పంపాను.” — ధర్మేంద్ర ప్రధాన్
ప్రధాన్ స్వయంగా నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నారని, ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందనడానికి రిజిజు వ్యాఖ్యలు నిదర్శనమని వర్గాలు పేర్కొంటున్నాయి.
జంతర్ మంతర్ వద్ద సంబరాలు..
ప్రధాన్ రాజీనామా వార్త వెలువడటంతో 36 రోజులుగా ఆందోళన చేస్తున్న సీజేపీ సభ్యులు, విద్యార్థులు, నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ శిబిరం వద్ద సంబరాలు మిన్నంటాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ రాజీనామాను “తొలి విజయం”గా అభివర్ణించారు.
అయితే, నీట్ బాధితుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, పోలీసు కేసుల ఉపసంహరణ అనే తమ మిగిలిన రెండు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.











