- దేశవ్యాప్తంగా 10 మార్గాల్లో ప్రయోగాలు
Nitin Gadkari About Hydrogen Fuel Routes | భారత రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
రాబోయే రోజుల్లో రవాణా పరిశ్రమకు హైడ్రోజనే భవిష్యత్తు అని, ఇంధనంగా దాని వినియోగాన్ని పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రధాన మార్గాల్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
గురువారం గాంధీనగర్లో జరిగిన ‘ప్రవాస్ 5.0’, ‘భారత్ ప్రవాస్ అవార్డుల’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు) రంగంలో భారతీయ పరిశ్రమ అద్భుతంగా రాణిస్తోందని తెలిపారు. సాంకేతికత, సరసమైన ధరల విషయంలో భారతదేశం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలుస్తుందని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు.
Read Also: ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’.. ఆస్ట్రేలియా చరిత్రలోనే తొలిసారి!
హైడ్రోజన్ ఇంధన ప్రయోగాలు సాగే ఆ 10 మార్గాలు ఇవే:
దేశంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన 10 పైలట్ రూట్లు ఇవే:
గ్రేటర్ నోయిడా – ఢిల్లీ – ఆగ్రా
భువనేశ్వర్ – కోణార్క్ – పూరీ
అహ్మదాబాద్ – వడోదర – సూరత్
సాహిబాబాద్ – ఫరీదాబాద్ – ఢిల్లీ
పుణె – ముంబై
జంషెడ్పూర్ – కళింగ నగర్
తిరువనంతపురం – కొచ్చి
కొచ్చి – ఎడపల్లి
జామ్నగర్ – అహ్మదాబాద్
విశాఖపట్నం – బయ్యవరం
మూడో స్థానానికి చేరిన ఆటోమొబైల్ రంగం.. లక్ష్యం నంబర్ వన్!
గత కొన్ని ఏళ్లుగా భారత ఆటోమొబైల్ రంగం సాధించిన ప్రగతిని నితిన్ గడ్కరీ గణాంకాలతో సహా వివరించారు.”నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 14 లక్షల కోట్లతో ప్రపంచంలో 7వ స్థానంలో ఉండేది.
నేడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగి, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పరిశ్రమగా అవతరించింది. త్వరలోనే దీనిని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేర్చడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. ఈ రంగం ద్వారా ప్రస్తుతం దేశంలో 4.5 కోట్ల ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు.
బస్సుల కొరత – ఉత్పాదకత పెరగాలి..
దేశంలో ఏటా 3 లక్షల బస్సుల అవసరం ఉండగా, ప్రస్తుతం తయారీదారులు 70 వేల నుండి 80 వేల బస్సులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారని, ఈ ఉత్పాదకతను మూడు రెట్లు పెంచాలని పరిశ్రమను కోరారు.
అలాగే అంతర్జాతీయంగా తగ్గిన లిథియం-అయాన్ బ్యాటరీ ధరల ప్రయోజనాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వినియోగదారులకు బదిలీ చేయాలన్నారు.
ప్రమాదాల వల్ల 3% జీడీపీ నష్టం..
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల కేంద్ర మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
“దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు, 1.80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. మరణిస్తున్న వారిలో 66 శాతం మంది 18-36 ఏళ్ల మధ్య వయసున్న యువకులే.
ఈ ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి 3 శాతం నష్టం వాటిల్లుతోంది. అందుకే రహదారి భద్రతకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.” అని మంత్రి తెలిపారు.








