RBI Clarifies On Selling One Lakh Crore Gold News | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో ఉన్న బంగారు నిల్వలను భారీగా విక్రయించిందంటూ అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన ఒక కథనం ఇటు బ్యాంకింగ్ రంగంలో, అటు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆర్బీఐ దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని.. అంటే భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన గోల్డ్ ను అమ్మేసిందన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఈ ప్రచారం కాస్తా వైరల్ కావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం కావడంతో తక్షణమే అధికారిక వివరణ ఇచ్చింది. ఆర్బీఐ తన వద్ద ఉన్న బంగారం నిల్వలను విక్రయించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం మరియు అవాస్తవం అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వద్ద భౌతిక బంగారం (Physical Gold) నిల్వలు 880.52 టన్నులుగా అత్యంత సురక్షితంగా, స్థిరంగా ఉన్నాయని ఆర్బీఐ గణాంకాలతో సహా వెల్లడించింది. అంతర్జాతీయ మీడియా చేసిన ఈ తప్పుడు ప్రచారాన్ని సెంట్రల్ బ్యాంక్ తీవ్రంగా ఖండించింది.







