- పీటీ ఉషతో కలిసి స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం!
CM Revanth Launches Young India Sports University | ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పండుగ ‘ఒలింపిక్స్’ ఆతిథ్యానికి భాగ్యనగరాన్ని సిద్ధం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది.
2036 ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు భారతదేశం గట్టిగా పోటీ పడుతున్న నేపథ్యంలో.. ఆ మెగా ఈవెంట్కు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వాలనే బలమైన ఆకాంక్షను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా నగరంలోని క్రీడా మౌలిక సదుపాయాలను సర్వసన్నద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మహాత్కార్యంలో భాగంగా గురువారం గచ్చీబౌలి స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, పీటీ ఉషతో కలిసి ‘గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్’, అలాగే ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు.
ప్రపంచ స్థాయి వసతులతో క్రీడా విశ్వవిద్యాలయం..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడాకారుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గచ్చీబౌలి పరిధిలో సుమారు 82 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక వసతులతో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి క్రీడా అకాడమీని ప్రభుత్వం నిర్మించబోతోంది.
ఈ ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి, 2028 డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు.
ఖేలో ఇండియాకు వేదిక..
ఒలింపిక్స్ లక్ష్యానికి ముందే.. రాబోయే నవంబర్ నెలలో ప్రతిష్టాత్మక ‘ఖేలో ఇండియా’ (Khelo India) క్రీడలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా హైదరాబాద్ తన క్రీడా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్ రేసులో హైదరాబాద్ రేంజ్ మార్చే వ్యూహం..
ఒలింపిక్స్ నిర్వహణ రేసులో నిలవాలంటే అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, అథ్లెట్లకు గదులు, రవాణా సౌకర్యాలు అత్యంత కీలకం.
గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో ఒలింపిక్ విలేజ్ నిర్మాణానికి, గ్లోబల్ ఈవెంట్లకు హైదరాబాద్ను నంబర్ వన్ ఛాయిస్గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొనడం, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా ప్రణాళికలపై సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.








