Kavitha Criticizes KTR | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా చేసుకొని మరోసారి విమర్శలు చేశారు.
హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో బహుజన సంఘాల నేతలతో భేటీ అయిన ఆమె, బీఆర్ఎస్ పార్టీ మరియు కేటీఆర్ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ పాదయాత్ర ను ఉద్దేశించి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు ప్రజల్లోకి వెళ్లలేదు? ఇప్పుడు అధికారం పోయాక పాదయాత్రలు చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం వెనుక అర్థమేంటని నిలదీశారు.
సామాజిక తెలంగాణే లక్ష్యంగా తాను కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టానని, అందరికీ అధికారం అందాలని మాట్లాడినందుకే తనపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిందని ఆమె వెల్లడించారు.
“నన్ను సస్పెండ్ చేసినా, సామాజిక తెలంగాణ సాధించే వరకు నా పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.
మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ వంటి బహుజన సంఘాలు తనకు మద్దతు తెలపడం కొండంత బలాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
వారణాసిలో పూజలు..
తనకు ఉన్న గ్రహగతులు అనుకూలించాలని, ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోవాలని తాను వారణాసిలో ప్రత్యేక పూజలు చేసినట్లు కవిత వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, సరైన సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని కవిత బాంబు పేల్చారు. ఈ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది.






