Kishan Reddy clarification on Tejasvi Surya Comments | లోక్సభలో ఏపీ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తోసిపుచ్చారు.
తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలను కానీ, పవిత్రమైన రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కానీ ఎక్కడా అవమానించలేదని ఆయన స్పష్టం చేశారు.
“1969 తొలిదశ ఉద్యమంలో 369 మందిని, మలిదశ ఉద్యమంలో వందలాది మంది యువకులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని మాత్రమే తేజస్వి ప్రశ్నించారు.
విభజన సమయంలో ఆ పార్టీ అనుసరించిన అశాస్త్రీయ, మోసపూరిత విధానాలను ఆయన తప్పుబట్టారు” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
విభజన ప్రక్రియలో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి, అసంబద్ధంగా వ్యవహరించిన తీరును ఎండగట్టే క్రమంలోనే ఆయన ఆ పోలికను వాడారని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల పోరాట ఫలితమని, ఆ ఉద్యమాన్ని బీజేపీ ఎప్పుడూ గౌరవిస్తుందని.. కానీ విభజన చేసిన ‘కాంగ్రెస్ తీరు’ను మాత్రమే తాము విమర్శిస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన చర్చలో తేజస్వి సూర్య మాట్లాడుతూ.. “కాంగ్రెస్ హయాంలో ఏపీ విభజన తీరు బ్రిటిషర్లు భారత్-పాక్లను విడగొట్టిన దానికంటే దారుణంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.






