TTD Alert | తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ (TTD) అలర్ట్ ఇచ్చింది. మార్చి 3న ఒకరోజు పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఆరోజు చంద్ర గ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.
మార్చి 3న ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుమారు 10.30 గంటల పాటు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆరోజు చంద్ర గ్రహణం సాయంత్రం 3.20 గం. ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది.
అయితే సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. దీంతో ఉదయం 9 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.
అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది. మార్చి 3న కొన్ని ముఖ్య సేవలు, దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాలను గమనించి తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది.










