Ex Minister To Join TRS | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాజీ మంత్రి బోడ జనార్ధన్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం నాడు బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆయన భేటీ అయ్యారు. తన అనుచరులతో కలిసి అతి త్వరలోనే పార్టీలో చేరుతానని కవితకు బోడ జనార్దన్ తెలిపినట్లు తెలంగాణ రక్షణ సేన వర్గాలు వెల్లడించాయి. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా జనార్దన్ స్పష్టం చేశారు.
బోడ జనార్దన్ మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
కల్వకుంట్ల కవిత గారు ఇటీవల స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బోడ జనార్దన్ లాంటి సీనియర్ నేత పార్టీలోకి వస్తుండటంతో సింగరేణి ప్రాంతంలో పార్టీకి మంచి ఊపు వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.







