Accident On ORR | హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-16 వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి లారీ వెనుక భాగంలోకి దూసుకుపోవడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఇద్దరు చిన్నారులు మృతి..
మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
సిరిసిల్ల వాసులుగా గుర్తింపు..
మృతులంతా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న వీరంతా యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అతి వేగంగా కారును నడపడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.








