CSK complaint against RCB DJ | ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన పోరాటాల్లో ఒకటైన CSK – RCB శత్రుత్వం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.
ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా హోమ్ టీమ్ డీజే (DJ) ప్రవర్తనపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీసీసీఐ (BCCI) కి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
వివాదానికి కారణమైన పాట..
మ్యాచ్ సమయంలో స్టేడియంలోని డీజే ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, చట్నీ’ అనే పాటను ప్లే చేశారు. గానా అప్పు పాడిన ఈ పాట సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్ల మీద వచ్చే మీమ్స్ (Memes) మరియు స్టీరియోటైపింగ్ కోసం ఎక్కువగా వాడుతుంటారు.
ఈ పాటను ప్లే చేయడం ద్వారా తమ జట్టును మరియు తమ మద్దతుదారులను అవమానించారని, ఇది ఒక రకమైన వేధింపు అని CSK తన ఫిర్యాదులో పేర్కొంది.
పాటతో పాటు, మ్యాచ్ మధ్యలో తమ ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారని CSK సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆరోపించారు.
నిజానికి ఈ ‘దోశ, ఇడ్లీ’ పాట వివాదం కొత్తదేం కాదు. గత ఏడాది ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఈ పాటను పాడుతున్న వీడియోను క్లబ్ షేర్ చేయడంతో వివాదం మొదలైంది.
అయితే, అప్పట్లో చెన్నై చెపాక్ స్టేడియంలో కూడా ఇలాంటి ఘటనలు జరక్కుండా తాము చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు బెంగళూరులో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
బీసీసీఐ స్పందన..
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ ఫిర్యాదును స్వీకరించిందని, ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. హోమ్ టీమ్కు మద్దతు ఇవ్వడం డీజేల పని అని, కానీ ప్రత్యర్థి జట్టును కించపరచడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని బోర్డు భావిస్తోంది.
మైదానంలో ఆటతో అలరించాల్సిన జట్లు, ఇలాంటి వివాదాలతో వార్తల్లోకి రావడం అభిమానులను కలవరపెడుతోంది. బీసీసీఐ ఈ విషయంలో డీజేపై లేదా ఆర్సీబీ ఫ్రాంచైజీపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.






