– కూటమి ప్రభుత్వ సమిష్టి కృషి అంటూ ప్రశంసలు!
Pawan Kalyan congratulates Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లో తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత విజయాలు సాధించడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన నారా లోకేష్ ‘పవనన్నా.. ఇది మన అందరి విజయం’ అంటూ బదులిచ్చారు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పైగా మెరుగుపడిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యా సంస్కరణలకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’, పరీక్షలకు ముందు అమలు చేసిన ‘100 రోజుల ప్రణాళిక’ వంటివి ఈ అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయని ఆయన కొనియాడారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి అది ఏకంగా 78.39 శాతానికి పెరిగిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఈ ఘనత సాధించిన ఉపాధ్యాయులను, అధికారులను ఆయన అభినందించారు.
నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి అభినందనలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. “పవనన్నా.. ఇది మనందరి విజయం. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ, ప్రభుత్వం చేసిన సమిష్టి కృషి. మీ ప్రోత్సాహం, అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖను దేశానికే రోల్ మోడల్గా నిలుపుతాను” అని లోకేష్ ట్వీట్ చేశారు.
పదో తరగతి అద్భుత ఫలితాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలోని ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన ఈ ఆత్మీయ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.







