CM Revanth Comments On New TRS | తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ఆవిర్భవించిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోమవారం నూతన ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్ ల ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ సంపద కోసమే ఈ కుమ్ములాటలు జరుగుతున్నాయని విమర్శించారు.
“బీఆర్ఎస్ పార్టీ పర్పస్ ముగిసిపోయింది. ఏ సిస్టమ్ అయినా పర్పస్ సాల్వ్ కాకపోతే డిసాల్వ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక చచ్చిన శవం లాంటిది.. దానికి ఎంత వైద్యం చేసినా వృథానే” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వారసత్వ సంపద కోసమే కొడుకు కేటీఆర్, కూతురు కవిత కొట్లాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ బతికుండగానే తన కొడుకును సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నారనే చర్చ పార్టీలోనే మొదలైందన్నారు.
ప్రస్తుతం ఉన్న బీఆరెస్ పార్టీకే (BRS) దిక్కు లేదని, ఇక కొత్త పార్టీ పెట్టి ఏం సాధిస్తారని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న పంపకాల గొడవను మాపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.









