- WB ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం..
- ఇటీవల ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు దగ్ధం
West Bengal EVM Fire Accident | పశ్చిమ బెంగాల్లో 4000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అగ్నికి ఆహుతి కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోల్కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయం కూడా ఉంది.
అగ్నిప్రమాదం కారణంగా అక్కడ నిల్వ ఉంచిన సుమారు 4000 ఈవీఎంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన అనంతరం స్థలాన్ని పరిశీలించిన పశ్చిమ బెంగాల్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నికి ఆహుతైన ఈవీఎంలు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించినవేనని వెల్లడించారు.
దీంతో ఈ ఘటన (West Bengal EVM Fire Accident) సాధారణ అగ్నిప్రమాదమా? లేక దాని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక వచ్చిన తర్వాతే అగ్నిప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
4000 ఈవీఎంలు ఒకేసారి దగ్ధం కావడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలపై ఆసక్తి నెలకొంది.









