Thursday 11th June 2026
12:07:03 PM
Home > తాజా >  ‘ఓటర్ల జాబితా సవరణపై రాజకీయం వద్దు’.. రాంచందర్ రావు ఫైర్!

 ‘ఓటర్ల జాబితా సవరణపై రాజకీయం వద్దు’.. రాంచందర్ రావు ఫైర్!

N Ramchander Rao Slams Congress And BRS తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.

ఎస్ఐఆర్ ప్రక్రియపై భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేవలం తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ అంశాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం మత్పల్లిలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఎస్ఐఆర్ లక్ష్యం పారదర్శకతే..
గతంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పుడు తాము బాధ్యతాయుతంగా వ్యవహరించామని రాంచందర్ రావు గుర్తు చేశారు. గతంలో ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని, కానీ ఇప్పుడు మాత్రం విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

“కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం ఒక్కటే.. అర్హులైన ఓటర్లు తమకు ఓటు హక్కు ఉన్న సొంత నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటం మరియు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం” అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో బలమైన శక్తిగా బీజేపీ..
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో బీజేపీ ఒక తిరుగులేని, బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, అందుకే ప్రజలు తమను నమ్ముతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ కూడా తెలంగాణలోని రైతులను, విద్యార్థులను, నిరుద్యోగ ఉద్యోగులను పూర్తిగా వంచించాయని, వారి ఆశలపై నీళ్లు చల్లాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాంచందర్ రావు హెచ్చరించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions