Sonam Wangchuk Ends Hunger Strike |పేపర్ లీక్ల జవాబుదారీతనంపై పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ల సమక్షంలో ఆసుపత్రిలో ఆయన దీక్షను ముగించారు. ఈ సమయంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా పక్కనే ఉన్నారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ (CJP) నేతృత్వంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో చేరిన వాంగ్చుక్, జూన్ 28న ఈ నిరాహార దీక్షను ప్రారంభించారు. దీక్ష సమయంలో ఆయన సుమారు 11 కిలోల బరువు తగ్గారు.
దీక్ష విరమణపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వాంగ్చుక్ త్వరగా కోలుకుని, పాత బరువును తిరిగి పొందాలని ఆకాంక్షించారు. కాగా, ఉద్యమం హింసాత్మకంగా మారకూడదనే ఉద్దేశంతోనే సుదీర్ఘ చర్చల తర్వాత నిరాహార దీక్షను విరమించినట్లు వాంగ్చుక్ ‘X’ వేదికగా వెల్లడించారు. అయితే సమగ్ర విద్యా సంస్కరణల కోసం శాంతియుత పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యాశాఖలో కీలక మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యా కార్యదర్శిగా నరేష్ కుమార్ గంగ్వార్ను నియమిస్తూ చర్యలు తీసుకుంది. పరీక్షలలో లీకేజీలకు పాల్పడే వారికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు కల్పించే సమగ్ర ముసాయిదా చట్టాన్ని త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.










