Saturday 8th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

ponguleti srinivasa reddy

  • ​అభివృద్ధి పనులకు సమాంతర ప్రాధాన్యం
  • తెలంగాణ ​ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

​Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి తిరుమలాయపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందజేశారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే కేవలం బీరోలు గ్రామానికి రూ. 29.92 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఇందులో భాగంగా రూ. 2.59 కోట్లతో బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, రూ. 64 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

అలాగే బంధంపల్లిలో రూ. 5.50 కోట్లతో దమ్మాయిగూడెం నుంచి సోలిపురం రోడ్డు మధ్య నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు, కల్వర్టుల నిర్మాణం, చెరువు మరమ్మత్తులు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేశామని వివరించారు.

​ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో పేదల చెంతకు చేరుతామని ధీమా వ్యక్తం చేశారు.

​ఆకేరు వాగు ముంపునకు గురైన రాకాసితండా బాధితులను మంత్రి పరామర్శించి, వారికి ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను అందజేశారు.

అలాగే రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, ఆలయ ధర్మకర్తలను శాలువాలతో సత్కరించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions