Saturday 23rd May 2026
12:07:03 PM
Home > క్రైమ్ > కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!

కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!

vc sajjanar
  • ఆకర్షణీయమైన రంగు వెనుక విషపు కోరలు..
  • నిఘా పెంచిన హైదరాబాద్ పోలీసులు!

Hyderabad CP Sajjanar warning on fake mangoes | వేసవి కాలం రాకతో పండ్లలో రారాజుగా పిలవబడే మామిడి పండ్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి.

అయితే, అధిక లాభాల కోసం కొందరు స్వార్థపరులైన వ్యాపారులు కృత్రిమ పద్ధతుల్లో రసాయనాలను ఉపయోగించి పండ్లను మగ్గిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

మార్కెట్‌లో లేదా రోడ్డు పక్కన బండ్ల మీద చాలా ఆకర్షణీయంగా, పసుపు పచ్చగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే, అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదని, కానీ కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన మాత్రమే రంగుగా ఉండి, లోపల పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని ఆయన వివరించారు.

రసాయనాలతో పండించిన ఇటువంటి కల్తీ మామిడి పండ్లను తినడం వల్ల తక్షణమే గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు మరియు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటి ప్రభావం దీర్ఘకాలంలో మరింత తీవ్రంగా ఉంటుందని, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు మరియు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే పండ్లను కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పండు సహజమైన రంగులో ఉందో లేదో గమనించాలని సూచిస్తున్నారు. కృత్రిమంగా మగ్గించిన పండ్ల కంటే, కాస్త ఆలస్యమైనా సహజంగా పక్వానికి వచ్చిన పండ్లను ఎంచుకోవడమే ఆరోగ్యానికి క్షేమకరమని స్పష్టం చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా కల్తీ పండ్ల విక్రయాలపై ‘హెచ్‌-ఫాస్ట్’ (H-FAST) బృందాలు నిరంతర నిఘా ఉంచుతున్నాయని సీపీ సజ్జనర్ వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘించి రసాయనాలను ఉపయోగిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

నగర ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా కల్తీ పండ్లు అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి కల్తీ మాఫియాను అంతం చేయగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

You may also like
cm revanth
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్!
whatsapp impersonation fraud
వాట్సాప్ వెబ్‌తో కోట్లలో స్కామ్.. సీఈవోల పేరుతో అకౌంటెంట్లకు మెసేజ్!
tg police wins
ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!
gurram guda forest land
గుర్రం గూడ అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటింపు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions