Harish Rao open letter to Uttam Kumar Reddy | తెలంగాణలోని భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు.
కాళేశ్వరం మరియు దేవాదుల ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను అశాస్త్రీయంగా ఆపరేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.
కుట్ర పూరిత చర్యలా..
ప్రాజెక్టుల్లోని భారీ పంపులు, మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ (On), ఆఫ్ (Off) చేస్తూ ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.
ఇలా చేయడం వల్ల వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్లు మరియు మోటార్లు శాశ్వతంగా పాడయ్యే ప్రమాదం ఉందన్న ఇంజనీరింగ్ నిపుణుల హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
“మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతుందా? ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా?” అంటూ ఆయన నిలదీశారు.
భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, వాటిని ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం వల్ల వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులు ధ్వంసమవుతాయని హెచ్చరించారు.
చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు.
రాజకీయ కక్ష సాధింపుల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వానికి సూచించారు.
తక్షణమే ఈ అశాస్త్రీయ విధానాన్ని మానుకుని, ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం నిరంతరాయంగా పంపులు నడిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రాజెక్టుల రక్షణ దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, నీటి పంపింగ్ విషయంలో పారదర్శకత పాటించాలని హరీశ్ రావు తన లేఖలో కోరారు.







