CM Revanth Responds On Crop Fire Incident | ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో ఆ రైతు కుటుంబం గుండె పగిలింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ కోణంలో స్పందించారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న చేనులో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే పంట అంతా బూడిదైంది. అప్పులు చేసి సాగు చేసిన పంట కళ్లముందే కాలిపోవడంతో, రైతు కుటుంబ సభ్యులు పొలంలోనే రోదించడం అందరినీ కలిచివేసింది.
ఈ హృదయ విదారక ఘటన సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని, తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి, రైతుకు భరోసా కల్పించే చర్యలు చేపట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఆపదలో ఉన్న ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.







