Thursday 18th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట్ రీ టెస్ట్.. ‘మిలిటరీ తరహా సెక్యూరిటీ’పై అన్నామలై విమర్శలు!

నీట్ రీ టెస్ట్.. ‘మిలిటరీ తరహా సెక్యూరిటీ’పై అన్నామలై విమర్శలు!

Annamalai Criticizes NEET Retest Security | మే నెలలో జరిగిన నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు కావడంతో, జూన్ 21న దేశవ్యాప్తంగా పునఃపరీక్ష (Retest) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే, ఈ రీ-టెస్ట్ కోసం కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి క్లాసిఫైడ్, మిలిటరీ తరహా రక్షణ వలయం మరియు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ నిబంధనలు విధించింది.

ఈ నిబంధనలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ భద్రతా ఏర్పాట్లు విద్యార్థులపై పరీక్ష ఒత్తిడిని మరింత పెంచడమే కాకుండా కొత్త సమస్యలకు దారితీస్తాయని మంగళవారం (జూన్ 16, 2026) ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఈ నెల ప్రారంభంలోనే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి, సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని (పొలిటికల్ మూవ్‌మెంట్) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న ‘నీట్’ ఏర్పాట్లు..

జూన్ 21న జరగబోయే పునఃపరీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రాలను తరలించేందుకు ఈసారి ఏకంగా ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ (IAF) విమానాలను వినియోగిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు పేపర్లను చేరవేసే సమయంలో స్థానిక పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ (CRPF), సీఐఎస్‌ఎఫ్ (CISF) బలగాలు రక్షణగా ఉండనున్నాయి.

PMO పర్యవేక్షణ..

ఈ మొత్తం ప్రక్రియను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మల్టీ-లెవెల్ పర్యవేక్షణ ద్వారా నిశితంగా గమనిస్తోందని అన్నామలై పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ముందు బయోమెట్రిక్ మరియు ఫేషియల్ రికగ్నిషన్ తనిఖీలు తప్పనిసరి చేశారు.

చైనా ‘గావోకావో’ పరీక్షతో బీజేపీ సమర్థన..

అన్నామలై చేసిన ‘మిలిటరీ తరహా భద్రత’ విమర్శలపై బీజేపీ నేత వినోద్ సెల్వం గట్టిగా స్పందించారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీల నిఘా అనేవి ఏదైనా ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పరీక్ష నిర్వహణలో సాధారణంగా జరిగే ప్రక్రియలేనని కొట్టిపారేశారు.

చైనాలో అత్యంత కఠినంగా నిర్వహించే ‘గావోకావో’ (Gaokao – National College Entrance Examination) పరీక్షను ఆయన ఉదాహరణగా చూపారు.

చైనాలో ఏటా 1.3 కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిబంధనల నడుమ ఈ పరీక్ష రాస్తారని, అక్కడెవరూ దానిని ‘మిలిటరైజేషన్’ అనరని, ప్రతిభను కాపాడటంగానే అభివర్ణిస్తారని స్పష్టం చేశారు.

విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం కలిగించాలి తప్ప, నిబంధనలు అమలు చేసిన ప్రతిసారీ ఇలా రాజకీయ భయాందోళనలు రేకెత్తించకూడదని హితవు పలికారు.

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ సమస్యలు..

కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలను అరికట్టేందుకు టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించిన సంగతిని అన్నామలై ప్రస్తావించారు.

పేపర్ లీక్ కాకుండా అదనపు నిఘా పెట్టడాన్ని విద్యార్థులు స్వాగతిస్తారని, కానీ ఎంట్రీ వద్ద సుదీర్ఘ తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేయడం, పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచడం వల్ల విద్యార్థుల మానసిక స్థితి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది నూతన విద్యా విధానం (NEP 2020) ఆశించిన ‘ఎగ్జామ్ స్ట్రెస్’ తగ్గించే లక్ష్యానికే విఘాతమన్నారు. ఇంతటి భారీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు కనీసం ‘అడ్మిట్ కార్డులు’ కూడా డౌన్‌లోడ్ చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోందని దుయ్యబట్టారు.

అయితే, అడ్మిట్ కార్డ్ యాక్సెస్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ గ్లిచెస్ ఉన్నాయని ఎన్‌టీఏ (NTA) కూడా ఎక్స్ వేదికగా అంగీకరించింది. తమ బృందాలు ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాయని ఎన్‌టీఏ హామీ ఇచ్చింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions