‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు!
K Kavitha speech at TRS party launch | తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) జెండాను శనివారం మునీరాబాద్ వేదికగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆరెస్ పార్టీతోపాటు కేసీఆర్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవిత ప్రసంగం ఆమె మాటల్లోనే..
“ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పుడున్న కేసీఆర్ వేరు. ప్రస్తుత కేసీఆర్ మారిన మనిషి.. ఒక మర మనిషి. ఆయన మన మనిషి కాదు. కేసీఆర్ గారు ప్రస్తుతం కొంతమంది ‘గుంటనక్కల’ చేతుల్లో ఖైదీ అయ్యారు.
ప్రజలకు కష్టం వస్తే ఆయన బయటకు రావడం లేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను చెబితే.. నన్ను పక్కన పడేసి పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్లో నేను కూడా భాగస్వామినే. ఆ తప్పులకు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తన ఆత్మను కోల్పోయింది. అందుకే నేను ‘తెలంగాణ రాష్ట్ర సేన’ను స్థాపించాల్సి వచ్చింది.
తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి నేను ‘అమ్మ’గా ఉండాలనుకుంటున్నా. అమ్మతనం ఉన్న పరిపాలనతోనే రాష్ట్రం బాగుపడుతుంది. నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసి మంచే చేశారు. దానివల్లే ఇప్పుడు స్వేచ్ఛగా ప్రజల కోసం పోరాడగలుగుతున్నా.
ప్రస్తుతానికి మనమే అసలైన ప్రతిపక్షం. రాబోయే రెండేళ్లలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. ఇన్ ఫ్రంట్ దెరీజ్ క్రొకోడైల్ ఫెస్టివల్” అంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత.
నీళ్లు, నిధులు, నియామకాలను గాలికి వదిలేసిన శక్తులకు వ్యతిరేకంగా సామాజిక తెలంగాణే లక్ష్యంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై ‘TRS’ అనే అక్షరాలు ఉండేలా పార్టీ జెండాను రూపొందించారు.






