CM Revanth Reddy Medigadda visit | కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ భవితవ్యాన్ని తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక విచారణను వేగవంతం చేసింది.
సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మరియు ఉన్నతాధికారులతో కలిసి బ్యారేజీని స్వయంగా పరిశీలించారు. బ్యారేజీలో కుంగిపోయిన 20, 21, 22 పిల్లర్ల వద్ద జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు.
బోర్ రిగ్స్ ద్వారా నిర్వహిస్తున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ మరియు జీపీఆర్ (GPR) పరీక్షల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ పునాదుల పటిష్టతను తెలుసుకునేందుకు మొత్తం 520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ శాంపిల్స్ ను పూణేలోని Central Water and Power Research Station ల్యాబ్కు పంపనున్నారు. ల్యాబ్ నుంచి వచ్చే నివేదికల ఆధారంగా బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన రానుంది.
ఆ నివేదిక అందాక, బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు చేపట్టాలా లేక కొత్త నిర్మాణం చేపట్టాలా అనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.










