– కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ
KTR Letter To Amit Shah | తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఘాటుగా లేఖ రాశారు.
సీఎం రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న KLSR ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్ష్యాధారాల మాయంపై ఆందోళన..
హైకోర్టు విచారణ సందర్భంగా కేఎల్ఎస్ఆర్ (KLSR) కేసు తాలూకు కీలక సాక్ష్యాధారాలు గల్లంతు అయ్యాయని అధికారులు చెప్పడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన బినామీ కంపెనీని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి విచారణ సంస్థలపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను మాయం చేయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదం కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.
దివాలా తీసిన కంపెనీకి రూ. 2500 కోట్ల కాంట్రాక్టులు!
KLSR కంపెనీ ఇప్పటికే దివాలా ప్రక్రియలో (NCLAT విచారణలో) ఉన్నప్పటికీ, దానికి సుమారు రూ. 2500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలా కేటాయిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ప్రధాన రహదారుల నిర్మాణ పనులను ఈ కంపెనీకే అప్పగించడంలో మనీ లాండరింగ్ కోణం ఉందని ఆరోపించారు.
గతంలో ఐటీ సోదాల్లో సీఎం రేవంత్ రెడ్డి వాడే ల్యాండ్ క్రూజర్ వాహనం కూడా ఈ కంపెనీ పేరు మీదే ఉందని కేటీఆర్ గుర్తుచేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు డిమాండ్
రాష్ట్ర పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని, ఈ వ్యవహారంపై CBI, ED, SFIO వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో సంపూర్ణ దర్యాప్తు జరిపించాలని కేటీఆర్ కోరారు.
ఈ లేఖ ప్రతులను కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్లకు కూడా పంపినట్లు ఆయన వెల్లడించారు.









