Sharmila on Jagan’s tweets | ఏపీ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం మొదలైంది. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు.
జగన్ ఒక “దత్తపుత్రుడిలా” బీజేపీని భుజాన మోస్తున్నారని ఆమె మండిపడ్డారు.
వివాదానికి కారణమైన జగన్ ట్వీట్..
బిల్లు వీగిపోయిన తర్వాత జగన్ స్పందిస్తూ.. “విపక్షాలు బిల్లును అడ్డుకుని ఏం సాధించాయి? ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు, అటు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగలేదు. 50 శాతం సీట్ల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండేది” అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.
షర్మిల కౌంటర్..
“దత్తపుత్రుడు జగన్ ముసుగు తొలగిపోయింది. విపక్షం ముసుగులో ఉన్నది కూడా ఆర్ఎస్ఎస్ (RSS) పక్షమేనని ఇవాళ తేటతెల్లమైంది” అని షర్మిల బాంబు పేల్చారు. టీడీపీ, జనసేన పార్టీల కంటే ఎక్కువగా ప్రధాని మోదీని జగన్ ఎందుకు మోస్తున్నారని ఆమె నిలదీశారు.
దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా అని ప్రశ్నించారు. “మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్తో ముడిపెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనం. అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై ఎన్డీయే (NDA) పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలి” అని ధ్వజమెత్తారు.
సీట్ల పెంపు పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు కోసే డీలిమిటేషన్ను జగన్ సమర్థించడం ఆంధ్రప్రదేశ్కు, దక్షిణాదికి ద్రోహం చేయడమేనని ఆమె ఆరోపించారు. ఏపీలో అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) వైఖరిని తప్పుబట్టకుండా, బిల్లును అడ్డుకున్న విపక్షాలను జగన్ విమర్శించడం పట్ల కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది.
దీని ద్వారా వైసీపీకి, బీజేపీకి మధ్య ఉన్న ‘అక్రమ పొత్తు’ మరోసారి బయటపడిందని షర్మిల తన విమర్శల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.






